30.3.25

అన్నమయ్య పద సంపదను భావితరాలకు అందించాలి : ఆచార్య గోవింద‌రాజు - ముగిసిన సాహితీ సదస్సులు










శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు పద సాహిత్యానికి ఆద్యుడని, ఆయన పద సంపదను భావితరాలకు అందించాలని ఎస్వీ ప్రాచ్య‌ ప‌రిశోధ‌నా సంస్థ విశ్రాంత ఆచార్యులు ఆచార్య గోవింద‌రాజు పేర్కొన్నారు. అన్నమయ్య 522వ వర్ధంతి మహోత్సవాలు తిరుప‌తిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ‌నివారం ఘ‌నంగా ముగిశాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్య‌క్ష‌త వ‌హించిన ఆచార్య గోవింద‌రాజు '' తాళ్ల‌పాక క‌వులు - వివిధ సేవ‌లు '' అనే అంశంపై అంశంపై ఉపన్యసిస్తూ, ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజల్లో అడుగంటిన భక్తిభావాన్ని చైతన్య పరిచి ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు శ్రీ వేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని తాళ్ల‌పాక క‌వులు సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారన్నారు. ఇందులో తాళ్లపాక అన్నమయ్య, ఆయన సతీమణి తాళ్లపాక తిమ్మక్క, కుమారులు, మనవళ్లు సాహిత్యంలో చేసిన కృషిని వివ‌రించారు.

తిరుప‌తి ఎస్వీ ఓరియంట‌ల్ డిగ్రీ క‌ళాశాల అధ్యాప‌కులు డా.హేమంత‌కుమార్‌ ''అన్నమయ్య సంకీర్త‌న‌ల‌లో తాత్త్విక చింత‌న‌ '' అనే అంశంపై ఉపన్యసిస్తూ, వైరాగ్యం, విరక్తి, కోర్కేలు లేక‌ పోవడం వంటి వాటిని ప్ర‌బోధిస్తూ, ప్ర‌జ‌ల‌ను ఆధ్యాత్మికత, మోక్ష మార్గంలో న‌డేపేందుకు అన్న‌మ‌య్య సంకీర్తనను రచించిన‌ట్లు తెలిపారు. వేదాంతాన్ని భక్తి అనే రసగుళిక ద్వారా సామాన్య ప్రజలకు చేరువ చేసిన మహనీయుడు అన్నమయ్య అన్నారు. నామ సంకీర్తన, నామ జపంతో జాతి, కుల, మతాలకతీతంగా భగవంతుని చేరవచ్చ‌ని తెలిపారు. శ్రీవారిని సంకీర్తన ద్వారా సామాన్యులకు చేరువ చేసేందుకు అన్నమయ్య కృషి చేసినట్లు వివరించారు.
హైద‌రాబాద్‌కు చెందిన ప్ర‌ముఖ సాహితీవేత్త శ్రీ శంక‌ర‌రావు '' అన్న‌మ‌య్య ప‌ద సాహిత్యం - ప‌రిష్క‌ర్త‌ల కృషి '' అనే అంశంపై అంశంపై ఉపన్యసిస్తూ, 500 ఏళ్ల క్రితం నాటి అన్నమయ్య సాహిత్యంలో నాటి వైభవాన్ని, సామాజిక జీవనాన్ని అద్భుతంగా వర్ణించారని ఆయన తెలిపారు. అన్నమ‌య్య నవ్య సంకీర్తనలను సేకరించి "తాళ్ళపాక సంకీర్తనలు- పరిశోధనలు - కొత్తగా వెలుగు చూస్తున్న తాళ్ళపాక కవుల పద సాహిత్యం" ను గ్రంథంగా రూపొందించినట్లు చెప్పారు. ఈయన కీర్తనల్లో భాష, సాహిత్యం, కళలు తదితర అన్ని అంశాల్లో ఉన్నతస్థాయి కనిపిస్తుందన్నారు. భక్తజనానికి వీనులవిందుగా శ్రీ వేంకటేశ్వరుని నామంతో కీర్తనలు రచించి అన్నమయ్య ప్రాచుర్యంలోకి వచ్చారని తెలిపారు. అన్న‌మ‌య్య కీర్త‌న‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి, శ్రీ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ వంటి మహానుభావులు చేసిన కృషిని వివ‌రించారు.
సాయంత్రం 6 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ నాగేశ్వ‌ర నాయుడు బృందం సంగీత స‌భ‌, రాజ‌మండ్రికి చెందిన శ్రీ‌మ‌తి విజ‌య‌ల‌క్ష్మీ బృందం హ‌రిక‌థ గానం చేయ‌నున్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ రాజ‌గోపాల‌రావు, ఇత‌ర‌ అధికారులు, క‌ళాకారులు, పుర‌ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

No comments :
Write comments