పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 522వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో బుధవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఊంజల్సేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో సప్తగిరిలు పులకించాయి.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు. అన్నమయ్యకు, వారి ఆచార్యపీఠమైన అహోబిల మఠానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. అహోబిలం శ్రీ నరసింహస్వామివారి అనుగ్రహంతో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు దీక్ష పొంది మంత్రోపదేశం పొందారని వివరించారు. ఈ మంత్రోపదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా టీటీడీ అన్నమయ్య జయంతి, వర్ధంతి ఉత్సవాలను నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా స్వామీజీని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలు ఈవో అందజేశారు.
ముందుగా దినము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో భాగంగా ”దినము ద్వాదశి నేడు…, భావములోన బాహ్యము నందును…., బ్రహ్మ కడిగిన పాదము…, ఎంత మాత్రమున ఎవ్వరు దలిచిన…., పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా…., కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు…., నారాయణతే నమో నమో…., ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు…., ” కీర్తనలను కళాకారులు రసరమ్యంగా గానం చేశారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ రాజగోపాల, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రామ కృష్ణ, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments