ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు.
భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments