2.4.25

గజవాహనంపై శ్రీ కోదండరామస్వామివారి అభయం







తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగ‌ళ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు స్వామివారు గజవాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.

సనాతన హైందవ ధర్మంలో గజ వాహనానికి విశిష్ఠ ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజ దర్బాలలో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై ఉంచుకుంటే స్వామికృపకు పాత్రులు అవుతారని ఈ వాహన సేవ తెలుపుతుంది.

ఇదిలా ఉండగా, మధ్యాహ్నం 3 గంటలకుశ్రీ సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ కోదండ రాముల వారి ఉత్సవ మూర్తులకు వసంతోత్సవం, ఆస్థానం నిర్వహించారు. వాహన సేవల్లో ఊరేగి అలసిన స్వాములకు ఉపశమనం కల్పించడానికి వసంతోత్సవం నిర్వహిస్తారు.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ ర‌వి, సూపరింటెండెంట్ శ్రీ మునిశంక‌ర్‌, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments