ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం బమ్మెర పోతన జన్మదినం పురస్కరించుకొని కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రఘునాథ్ అధ్యక్షత వహించినారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో శ్రీ పసుపులేటి శంకర్ శ్రీ భాగవతం - ప్రాశస్త్యం” ను వివరించారు. శ్రీ నారాయణరెడ్డి “రుక్మిణీ సందేశము” పోతనా మాత్యులవారి రచనా రామణీయకతను, ముకుందుని ముందర రుక్మిణీరమణి అంతరంగాన్ని ఆవిష్కరించారు.
శ్రీ చంద్రశేఖర్ గారు భాగవతంలోని “ గజేంద్ర మోక్షం” అనే అంశంపై ప్రసంగించారు. డా. గోపాలకృష్ణ శాస్త్రి “కుచేలోపాఖ్యానం ” అనే అంశంపై మాట్లాడుతూ, శ్రీ కృష్ణుడు చిన్నతనంలో గురుకులంలో ఉంటున్నప్పుడు కుచేలుడితో ఉన్న స్నేహం గురించి తెలిపారు. కుచేలుడు నిజమైన బ్రాహ్మణుడిలా ధనార్జన మీద ఆశ లేకుండా, పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం తదితర అంశాలు వివరించారు. ఆచార్య పార్వతి “ప్రహ్లాద చరిత్ర” అనే అంశంపై ప్రసంగించారు.
డా. నీలవేణి “రంతి దేవుని చరిత్ర” పై మాట్లాడుతూ, రంతి దేవుడు 48 రోజుల పాటు వరుసగా ఉపవాసం ఉండి, 49వ రోజు అన్నం వండుకుంటాడని చెప్పారు. అన్నం ఆరగించేలోగా మొదట పేదవాడు, తరువాత ఇద్దరు పేద వాళ్ళు, చివరిగా ఒక కుక్క అక్కడికి వచ్చి అన్నం అడిగితే రంతి దేవుడు సంతోషంగా అన్నం ఇచ్చినట్లు తెలిపారు. తాను ఆకలితో ఉన్న, ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది అనుకుంటాడని వివరించారు.
అదేవిధంగా డా. శివారెడ్డి “వేమన చరిత్ర” పైన కవిత్వాన్ని చెప్పారు. భగవదా అనుగ్రహం లేకుండా ఏమి సాధించలేమని భగవదా అనుగ్రహానికి పాత్రులు కావాలని ఈ సందర్భంగా పాల్గొన్న ప్రముఖ కవులు తెలియజేశారు.
No comments :
Write comments