8.4.25

హంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల క‌టాక్షం

 








ఒంటిమిట్ట / తిరుపతి, 2025 ఏప్రిల్ 07: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమ‌వారం రాత్రి 7 గంటల నుండి హంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులను క‌టాక్షించారు.

భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్‌ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ న‌వీన్ ‌ తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments