తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధవారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు.
ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యుడు తేజోనిధి. సకలరోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి.
అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఏ్రపిల్ 3న రథోత్సవం
శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన గురువారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 5.15 గంటలకు మీన లగ్నంలో స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 9.15 గంటలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
No comments :
Write comments