టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు తెలిపారు. గత పాలనలో జరిగిన అవకతవకలను గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడిలో ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నామని సోమవారం టిటిడి పరిపాలనా భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు టిటిడి గోశాలలో పలు అక్రమాలు, అవకతవకలు జరిగాయని అప్పటి విజిలెన్స్ నివేదికలలో తేటతెల్లమవుతోందన్నారు. గోశాలలో గోవులకు కాలం చెల్లిన మందులు, మందులు ఎక్కడ తయారు చేశారో లేబుల్ లు కూడా లేని మందులు గోవులకు ఇచ్చినట్లు, పురుగులు పడ్డ దాణా, పాచిపట్టిన నీరు అందించారని, చనిపోయిన గోవుల వివరాలను నమోదు చేయలేదని టిటిడి విజిలెన్స్ నివేదికలలో నమోదైనా ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాచిపెట్టారని మాట్లాడారు. తీవ్ర వ్యాధులతో ఉన్న గోవులను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమైనా ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదన్నారు. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం మూలంగా రెండు సార్లు గోశాలలో అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. దాణా, మందుల సరఫరా కాంట్రాక్ట్ లోను భారీగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇపుడు వీటిపై చర్యలు చేపట్టామన్నారు. గతంలో విజిలెన్స్ అధికారులను అనుమతించలేదని, ఇపుడు ఎవరైనా గోశాలకు వెళ్లి చూడవచ్చని, చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. టిటిడి గోశాలలో పాల ఉత్పత్తిలో గతం కంటే అదనంగా గోవులు పాలు ఇస్తున్నాయన్నారు.
టిటిడి గోశాలలో 100 ఆవులు అనుమానాస్పదంగా మరణించాయని, టిటిడి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో మాజీ టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేసిన ఆరోపణలను నిరాధారమైనవని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో చేసిన ఆరోపణలను ఈఓ తోసిపుచ్చారు. మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు ఎస్వీ గోశాలలో చాలా అవినీతి కార్యకలాపాలు జరిగాయని, అప్పట్లో (మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు తిరుపతిలోని ఎస్వీ డెయిరీ ఫామ్లో) టిటిడి విజిలెన్స్ నివేదిక సమర్పించిన వీడియో క్లిప్పింగ్లు మరియు గణాంక ఆధారాలను, టిటిడి గోశాలలో జరిగిన దుర్వినియోగాన్ని మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గోవులు ప్రతి నెల సగటున 15 ఆవులు వయోభారం, వ్యాధులతో చనిపోతాయని చెప్పారు. 2024 ఏడాది నాటికి 179 గోవులు మరణించగా, 2025 ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో 43 గోవులు మృతి చెందాయన్నారు. చనిపోయిన గోవులు వయోభారం, వ్యాధుల కారణంగా సహజ మరణాలేనన్నారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 59 లేగ దూడలు జన్మించాయన్నారు. వాస్తవాలు ఇలా వుంటే టిటిడి బోర్డు మాజీ అధ్యక్షులు శ్రీ బి. కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, గోవుల దాణాను విస్మరించినట్లు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మృతి చెందినట్లు నిరాధారమైన ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. శ్రీ బి. కరుణాకర్ రెడ్డికి నిజంగా గోవుల మీద ఆందోళన వుంటే వారి పాలనలో జరిగిన అక్రమాలపై ఎందుకు దర్యాప్తు చేయలేదన్నారు. టిటిడి గోశాలకు కొత్తగా డైరెక్టర్ వచ్చాక ఈ అవకతవకలు, అక్రమాలు, నిర్లక్ష్యం తదితర అంశాలన్నీ వెలుగులోకి వస్తున్నాయన్నారు. గతంలో దళారులకు అడ్డాగా మారిన టిటిడిని , ఇపుడు దళారులపై పూర్తిగా కట్టడి చేసి చర్యలు చేపట్టామన్నారు.
గత జూన్ నుండి టిటిడిలో అన్నప్రసాదం మరియు శ్రీవారి ప్రసాదాల రుచిని పెంచడం, లడ్డూ నాణ్యత, సేవలలో పారదర్శకత, దర్శన టిక్కెట్లు మరియు వసతి, దళారులను కట్టడిచేయడం, టిటిడి ఐటీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. టిటిడి ఐటీ విభాగంలో అనర్హుని ఐటీ జీఎంగా చీఫ్ ఇంజనీర్ ర్యాంక్ హోదాలో నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, అక్రమ నియామకంపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత జూన్ నెలకు ముందు శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరాదారులపై చర్యలు చేపట్టి వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టామన్నారు. అదేవిధంగా శ్రీవారి అన్నప్రసాదాల తయారీకి సేంద్రీయ ఉత్పత్తులను విరాళంగా ఇచ్చే పేరుతో, దాతలు రూ.5 కోట్ల విలువైన కల్తీ సేంద్రీయ ఉత్పత్తులను సరఫరా చేసినందుకు, దాదాపు రూ.25 కోట్ల వరకు దాతలకు టిటిడిలో పలు ప్రివిలేజేస్ కల్పిస్తూ పాస్ పుస్తకాల ప్రయోజనాన్ని పొందేలా నిర్ణయాలు తీసుకున్నారని, నిబంధనల ప్రకారం ఇలాంటి విరాళాలకు ఎలాంటి ప్రత్యేక హక్కులు లేకున్నా ప్రివిలేజ్డ్ పాస్ పుస్తకాలు జారీ చేశారన్నారు. ఇలాంటి అక్రమాలను తాము రద్దు చేశామని ఈవో మీడియా ముందు చెప్పారు.
ప్రస్తుతం భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పంపిణీ చేస్తున్నామని, భక్తుల మనోభావాలు కాపాడటానికి కట్టుబడి ఉన్నామని, ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని, ప్రస్తుతం అందుతున్న సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.
ప్రస్తుతం భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పంపిణీ చేస్తున్నామని, భక్తుల మనోభావాలు కాపాడటానికి కట్టుబడి ఉన్నామని, ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని, ప్రస్తుతం అందుతున్న సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఈ సమావేశంలో టిటిడి జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, టీటీడీ డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ మరియు ఇన్-చార్జ్ డైరెక్టర్ ఎస్వీ గోశాల శ్రీ శ్రీనివాసులు, వీజీఓ విజిలెన్స్ శ్రీ రామ్కుమార్ తదితరులు హాజరయ్యారు.
No comments :
Write comments