24.4.25

తిరుమలలో భాష్యకారుల ఉత్సవం ప్రారంభం




తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది. మే 2న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.
భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయ్యంగార్లు దివ్యప్రబంధ గోష్టి చేపట్టారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆల‌య అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments