16.4.25

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని పుష్పయాగం







ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు.
సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభ‌వంగా ప్రారంభమైంది. తులసీదళాలు, మల్లెలు, రోజా, చామంతి, గన్నేరు, సంపంగి, మొగలి దళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 2.5 టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి.
ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ న‌టేష్ బాబు, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ న‌వీన్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments